వైసీపీలో కలవరం రేపుతున్న సుజనాచౌదరి వ్యాఖ్యలు

శనివారం, 23 నవంబరు 2019 (11:39 IST)
ఏపీలో రాజకీయం భిన్నంగా నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ వైసీపీ ఎంపీలు బీజేపీ టచ్‌లో ఉన్నారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దీనికి ఎంపీ సుజనాచౌదరి మాటలు ఆజ్యం పోశాయి. దీంతో వైసీపీ భగ్గుమంది. ఏపీలో ప్రభుత్వం మారిన ఆరునెలలకే వలసల రాజకీయం ఎందుకు హైలెట్ అవుతోందనే ప్రశ్న అందరిలో మెదలుతోంది.
 
సుజనాచౌదరి అనాలోచితంగా అన్నారో.. లేక ప్రీప్లాన్‌గా అన్నారో కానీ బీజేపీలోకి వచ్చేందుకు టీడీపీ, వైసీపీ నేతలు రెడీగా ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది. 
 
టీడీపీకి ఇలాంటివి అలవాటయిపోయాయి. ఎవరుపోయినా పోతేపోనీ అనుకోవడం తప్ప ఆ పార్టీకి మరోదారి లేదు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు. తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ. 25కు 22 మంది ఎంపీలు గెలిచారు. 175కు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 
 
అంతలా విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా ఆరునెలల్లో అంటే ఏదో తేడా జరుగుతోందనే లెక్క. అందుకు సుజనా మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఆ ప్రకంపనలు సుజనాపై మాటల తూటాల రూపంలో బయటకు వచ్చాయి. రోజంతా వైసీపీ ఎంపీలు, సుజనాపై ముకుమ్మడి దాడి చేశారు. 
 
ఢిల్లీలో ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం పెట్టి సుజనాపై మండిపడ్డారు. తమలో ఎవరు బీజేపీ టచ్‌లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఎంపీల మీడియా సమావేశానికి కొంతమంది ఎంపీలు రాలేదు. అలాగే రెండు రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డితో జరిగిన సమావేశానికి కొంతమంది డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు కానీ మంత్రులు, ఇతర నేతలు సుజనాపై విమర్శల్లో ఓ స్పష్టమైన అడ్డుగీత గీసుకున్నారు.
 
విమర్శల్లో ఓ స్పష్టమైన అడ్డుగీత గీసుకున్నారు. అదేంటంటే బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం. సుజనాచౌదరిని విమర్శించడంలో ఓ కచ్చితమైన లైన్ పాటించారు. సుజనాను వ్యక్తిగతంగా విమర్శించారు. సుజనాకు టీడీపీకి లింక్ పెట్టారు. కానీ ఇప్పుడు సుజనా ఉన్న బీజేపీపై నోరు జారకపోవడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు