అమ్మ పార్టీతో ప్రధాని మోడీ సఖ్యత ఉండాల్సిందే.. లేదంటే అంతే.. ఎందుకో తెలుసా?

గురువారం, 8 డిశెంబరు 2016 (14:38 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కమలనాథులు అన్నాడీఎంకే నేతలతో సఖ్యత మెలగాల్సిన పరిస్థితి ఉంది. దీని వెనుక పెద్ద ప్లాన్ లేకపోలేదు. 
 
వచ్చే యేడాది రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున నిలబడే అభ్యర్థి విజయం సాధించాలంటే విధిగా అన్నాడీఎంకే వంటి మిత్రపక్షాల బలం తప్పనిసరి. 
 
ప్రస్తుతం అన్నాడీఎంకే 37 మంది లోక్‌సభ సభ్యులతో పాటు 13 మంది  రాజ్యసభ సభ్యులు అంటే మొత్తం 50 మంది ఎంపీలు ఉన్నారు. వీరితో పాటు.. 137 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరి మద్దతు కావాలంటే అన్నాడీఎంకే మోడీ సఖ్యతగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అదేసమయంలో జయలలిత ప్రియనెచ్చెలి శశికళ కూడా ప్రధాని మోడీకి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కారణం అక్రమాస్తుల కేసులో శశికళ కూడా దోషే. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అదేసమయంలో జయలలిత స్థానంలో ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి... రాజ్యాంగేతర శక్తిగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారు.
 
తద్వారా పార్టీపైనా, ప్రభుత్వంపైనా పెత్తనం చేయాలని కోరుకుంటారు. పైగా, పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకోవడమే కాకుండా, పార్టీని మరింత బలోపేతం చేయాలనే శశికళ కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పెక్కుమంది ఆమె వర్గీయులే కావడం గమనార్హం. అందువల్ల ఆమె వ్యూహాలకు ఎలాంటి ఆటంకం కలగబోదని చెప్పొచ్చు.

వెబ్దునియా పై చదవండి