శ్రీవారి చెంత నుంచి శెట్టిపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్.. ఎందుకు?

సోమవారం, 14 మే 2018 (19:21 IST)
పవన్ తన పవర్ పాలిటిక్స్‌ను మొదలుపెట్టారా. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారా. స్వామివారి ఆశీస్సులతో పవన్ వేయబోతున్న తొలి పొలిటికల్ స్టెప్ ఎలా ఉండబోతోంది. చిత్తూరు జిల్లాలో పవన్ చేయబోయే పర్యటన ఎలాంటి ప్రభావం చూపబోతోంది. జనంలోకి వస్తున్నాడు జనసేనాని. పూర్తిస్థాయి రాజకీయపార్టీగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో స్వామివారి సేవకై తిరుమలకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ దర్శనం అనంతరం తిరుపతి శివార్లలోని శెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. 
 
రైతులు తరపున ప్రభుత్వంపై పోరాటానికి సిద్థమవుతున్నారు. సమస్యలపై పోరాటంతోనే ప్రజల్లోకి వెళ్ళాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగానే గతంలో తమకు న్యాయం చేయమంటూ పవన్‌ను ఆశ్రయించిన వారి బాధలు తెలుసుకోవడం కోసం నేరుగా జనంలోకి వస్తున్నారు. అయితే పవన్ పర్యటనతో అక్కడి రైతులకు మేలు జరుగుతుందా. వారి సమస్యలో ఉన్న న్యాయపరమైన అంశాలేంటి. ప్రభుత్వం చేస్తున్న వాదనేంటి. 
 
శెట్టిపల్లి గ్రామంలో కొన్ని వందల ఎకరాలను కొన్నియేళ్ళుగా సాగు చేసుకుంటున్నారు రైతులు. అయితే రైతులకు ఆ భూములకు సంబంధించిన ఎలాంటి పట్టాలు లేవంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలున్నాయి. పారిశ్రామికవాడ అభివృద్థి పేరుతో ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడానికి ప్రభుత్వం చూస్తోందన్న వాదనలు వున్నాయి. అభివృద్థి కోసం తమ భూములను వదులుకోవడానికి సిద్థమైనప్పటికీ కనీసం పరిహారమైనా ఇప్పించాలన్న రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. 
 
ఈ నేపథ్యంలో వారి కోసం గళం విప్పబోతున్న పవన్ కళ్యాణ్‌ వారికి ఏవిధంగా న్యాయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శెట్టిపల్లి గ్రామస్తులను కలుపుకుని ప్రత్యక్ష పోరాటంతో ప్రభుత్వంపైన పోరాటం చేస్తారా.. లేకుంటే చట్టపరంగా వారికి ఆ భూములు దక్కే విధంగా పోరాడుతారో అన్నది త్వరలోనే తేలనుంది. జనసేనానిపై కోటి ఆశలు పెట్టుకున్న గ్రామస్తుల కోరిక ఎంతవరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు