ఇంతకీ షర్మిల ఎవరి వ్యూహంలో భాగస్వామి? భాజపాను తొక్కేయడానికా? కారుకి బ్రేకులేయడానికా?

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (15:56 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న అంశంలో క్లారిటీ వచ్చేసింది. ఆమె సంప్రదింపులు ప్రారంభించారు. ఇవాళ కాకపోతే రేపు ఆమె పార్టీ పెట్టడం ఖాయం. అయితే ఇప్పుడు ఆ విషయంపై చర్చ జరగడం లేదు. ఆమె ఎవరు వదిలిన బాణం అన్నఅంశం పైనే చర్చ జరుగుతోంది.
 
జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీ పెట్టిస్తున్నారా లేకపోతే.. బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా లేకపోతే… కేసీఆర్‌కు గండి కొట్టడానికి బీజేపీ ఈ స్కెచ్ వేసిందా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. కానీ… షర్మిల సొంతంగా పార్టీ పెట్టేసి.. తెలంగాణ సీఎం అయిపోతుదంని మాత్రం ఎవరూ అంచనా వేయడం లేదు. ఆంధ్రప్రాంతానికి చెందిన నేత తెలంగాణాలో పార్టీ పెట్టాలనే ఆలోచనే అనూహ్యం. ఆ ఆలోచనను.. షర్మిల చేశారు.
 
ఒకవేళ అన్నయ్యతో విభేదాలొస్తే… ఏపీలో పార్టీ పెట్టుకుంటారు కానీ తెలంగాణలో ఎందుకు పెడతారన్నది చాలా మందికి వచ్చిన డౌట్. అందుకే రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తెలంగాణలో మారిపోతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అర్జంట్‌గా కేసీఆర్ కొత్త వ్యూహాల్ని అమలు చేయాల్సిన పరిస్థితిలో పడ్డారని.. ఆయనే జగన్మోహన్ రెడ్డితో కలిసి షర్మిలతో కొత్త పార్టీ ప్లాన్ చేశారని ఓ వర్గం అంచనా వేస్తోంది. దీనికి రకరకాల సమీకరణాలు చెబుతున్నారు.
 
షర్మిల పార్టీ పెడితే రెడ్డి సామాజికవర్గంతో పాటు… కన్వర్టడ్ క్రిస్టియన్, దళితులు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి వారిలోఅత్యధికం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఎన్నికలు జరిగితే వారంతా బీజేపీ వైపు వెళ్తారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ గట్టిగా పోరాడి… నమ్మకం కలిగిస్తే.. వారంతా కాంగ్రెస్ తోనే ఉంటారు. ఈ పరిస్థితిని ఎవాయిడ్ చేయడానికి ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ఈ వ్యూహం పన్నారని అంటున్నారు.
 
మరోవైపు షర్మిలకు బీజేపీ సపోర్ట్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. కేసీఆర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ… షర్మిల పార్టీని రంగంలోకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడితే.. ఆ ప్రభావం ఎక్కువగా అధికార పార్టీ పైనే పడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా కనుమరుగు అవడంతో పాటు.. అధికార వ్యతిరేకత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
 
షర్మిల ఇప్పటికే అమిత్ షాతో చర్చలు జరిపారని… త్వరలో ప్రత్యక్షంగా కలుస్తారని.. ఆమె బీజేపీతో కలిసి నడుస్తుందన్న అంచనాలను ఇప్పటికే ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇవేమీ కాదు.. అసలు జగన్మోహన్ రెడ్డి.. తన కుటుంబానికి అధికారం కోసం… ఇలా చెల్లితో గేమ్ ఆడిస్తున్నారన్న అనుమానాలు కూడా కొంతమందిలో ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా చెల్లి ఏపీలో పవర్ సెంటర్ అయితే ఇబ్బంది అవుతుందని.. అందుకే ఆమెకు తెలంగాణ కార్యక్షేత్రం అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీని మళ్లీ రివైవ్ చేయాలంటే.. ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయి. అందుకే.. షర్మిలను స్వతంత్రంగా రాజకీయం చేసేలా ప్రోత్సహించారని అంటున్నారు. షర్మిల పార్టీ పనుల్లో అత్యధికంగా వైసీపీ నేతలే కనిపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు