గ్యాస్ రాయితీకి మంగళం ... ప్రధాని మోడీ సర్కారు దొంగదెబ్బ!

సోమవారం, 1 మార్చి 2021 (11:46 IST)
దేశంలోని అనేక కోట్లమందికి గ్యాస్ సబ్సీడీని పొందుతున్నారు. దీనివల్ల కేంద్ర ఖజానాపై భారీగా భారంపడుతోంది. అయినప్పటికీ.. గత ప్రభుత్వాలు  గ్యాస్ రాయితీని కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్యాస్ రాయితీలో క్రమంగా కోత విధిస్తూ వచ్చారు. గతంలో సిలిండర్ ధరలో సగంగా ఉండే రాయితీ.. ఇపుడు కేవలం పది రూపాయల లోపే ఉంటుంది. కంటికి తెలియకుండా రాయితీకి మంగళంపాట పాడేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల సాకుతో గ్యాస్ సబ్సీడీలో కోత విధిస్తున్నాయి. ఫలితంగా గ్యాస్ రాయితీ అనేది లేకుండా పోతోంది. 
 
నిజానికి వినియోగదారుల ఖాతాలో ఒకప్పుడు రూ.500 వరకు జమ అయ్యే రాయితీ ఇప్పుడు నాలుగు రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ.816గా ఉండగా, వినియోగదారుల ఖాతాలో 16 రూపాయలు మాత్రమే జమ అవుతోంది. విశాఖలో సిలిండర్ ధర రూ.800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది.
 
తిరుపతిలో సిలిండర్ ధర రూ.830 కాగా, 17 రూపాయల రాయితీ లభిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో సిలిండర్ ధర రూ.863గా ఉండగా, ఇక్కడ మాత్రం రూ.49 రాయితీ జమ అవుతోంది. ఊరికి, ఊరికి మధ్య రాయితీ ఒక్కోలా జమ అవుతున్నా ఎక్కడా రూ.50కి మించి జమ కాకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.15 కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌ను వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి ఏకంగా రూ.4,140 కోట్ల భారం పడుతోంది. 
 
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత మూడు నెలల్లో రూ.200 పెరిగింది. గతేడాది నవంబరులో రూ.616 ఉన్న సిలిండర్ ధర ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగి రూ.816కు చేరుకుంది. ధర రూ.200 పెరిగినా రాయితీ మాత్రం రూపాయి కూడా పెరగకపోవడం గమనార్హం. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. మోడీ సర్కారు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు