భోజనం చేశాక.. పొట్ట నిండిపోయేలా నీటిని తాగేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..

బుధవారం, 2 నవంబరు 2016 (15:48 IST)
శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడదని వారు చెప్తున్నారు. పరగడుపున రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. పరగడుపున తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి చేకూరుతుంది. ఇలా రోజూ చేస్తే శరీరంలోని మలినాలు వెలివేయబడుతాయి. 
 
అలాగే ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నీటిని సేవించడం మంచిది కాదు. ఆహారం తీసుకున్న వెంటనే పొట్ట నిండేలా నీటిని సేవిస్తే.. అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీటిని తాగకూడదు. నీటికి బదులు మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు కాసిన్ని నీరు సేవించండి. పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.  
 
నీరసంగా ఉన్నప్పుడు మన మెదడులో నీరు 75 శాతం మాత్రమే ఉందని గమనించాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినన్ని నీరు సేవించాలి. నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా నీటిని సేవించడాన్ని మరిచిపోకూడదు. అయితే సాయంత్రం పూట తక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు వ్యాయామానికి అనంతరం నీటిని తీసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి.

అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు నీటిని సేవించడం మంచిది. గర్భిణీ మహిళలు, బాలింతలు అధికంగా నీటిని తీసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిగిలిన వారు రోజుకు 8 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి