పండ్లలోని గింజలు చేసే మేలేంటో తెలుసా?

గురువారం, 18 ఆగస్టు 2016 (17:48 IST)
అందంగా, ఆరోగ్యంగా కనబడాలంటే ఆరోగ్యకర ఆహరం తప్పని సరిగా తీసుకోవాలి. చర్మానికి కావలసిన పోషకాలు అందితేనే ఆరోగ్యంగానే కాకుండా అందంగా కనబడుతారు. వీటిలో ముఖ్యమైనవి పండ్లు. అన్ని రకాల సీజన్‌లో దొరికే పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాని కొంతమంది పండ్లను మాత్రమే తిని విత్తనాలను తినకుండా పారేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్ల  గుజ్జు కన్నా ఆ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
 పుచ్చకాయలు వేసవిలో దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. కాని చాలా మంది పండు తిని విత్తనాలను పడేస్తారు. కాని ఆ విత్తనాలు జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయట. వీటిని పండుతో పాటు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే పొట్రియోలిక్ ఎంజైమ్‌ల వల్ల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వైద్యుల సలహాతో ఈ గింజలు ఇవ్వడం మంచిదట. 
 
ఇంకా గుమ్మడి కాయ విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్‌తో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మకాయ గింజలు, కివి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఇంకా ద్రాక్ష పండు యొక్క విత్తనాలను తినేటప్పుడు పడేయకుండా ఎండబెట్టి, పొడిగా దంచితే ఇది సహజ యాంటీ-బయాటిక్‌గా పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ పొడిని ముక్కు ద్వారా పీల్చటం వలన ముక్కులోని శ్లేష్మ స్థాయిలు తగ్గుతాయి, వీటితో పాటూ సుక్ష్మ జీవులు, వాటి సంబంధిత కారకాలు కూడా నశిస్తాయని నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి