తిన్నది అరగటంలేదు, ఒకటే త్రేన్పులు, ఎందుకని?

శుక్రవారం, 4 మార్చి 2022 (00:03 IST)
అసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అన్నం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగానూ, త్రేన్పులు వస్తుంటాయి. ఈ అసిడిటీకి గల కారణాలు ఏమిటో చూద్దాం. సరిగా నిద్ర లేకపోవడం ఒకటైతే తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం మరో కారణం.

 
అలాగే తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. తీసుకునే ఆహారం మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. అలాగే సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఎసిడిటీకి దారి తీస్తుంది.

 
అసడిటీ అదుపు చేసేందుకు చిట్కాలు
అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతి రోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూస్, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

 
తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ను తగుమోతాదులో తీసుకోవాలి.

 
తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇలా వుంటే ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. భోజనం తీసుకున్న వెంటనే నిద్ర పోకూడదు. మద్యపానం, ధూమపానం అలవాటుకి దూరంగా వుండాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు