ఒక వ్యక్తి జీవిత కాలాన్ని అంచనావేసేందుకు ఓ బయోమార్కర్ వ్యవస్థను అభివృద్ధిచేశారు. దీనికోసం 5,000 మంది రక్త నమూనాలపై పరిశోధన చేపట్టారు. వాటిని దానంచేసిన వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. ముఖ్యంగా ఏళ్లు పైబడటంతో వచ్చే క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల లక్షణాలు, వాటి బయోమార్కర్లను గుర్తించారు.
వీటితో 26 భిన్న బయోమార్కర్లు కలిగిన తాజా అంచనాల వ్యవస్థను సిద్ధంచేశారు. మన రక్త నమూనాలోని బయోమార్కర్లను వీటితో సరిపోల్చడంతో ఎన్నేళ్లు బతకగలమో చెప్పొచ్చని పరిశోధకులు థామస్ పెర్ల్స్ వివరించారు. ఈ పద్ధతిలో తొలినాళ్లలోనే వివిధ వ్యాధుల ముప్పులనూ గుర్తించే వీలుందని పేర్కొన్నారు. అయితే ఫలితాల్లో ఖచ్చితత్వం పెంచేందుకు లోతైన పరిశోధన అవసరమని అభిప్రాయపడ్డారు.