వారానికి 2 సార్లు చేపలు తింటే... కంటి చూపు సురక్షితం

శనివారం, 20 ఆగస్టు 2016 (09:40 IST)
చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
 
ఇదే అంశంపై బార్సిలోనాలోని లిపిడ్‌ క్లినిక్‌ పరిశోధకులు ఓ పరిశోధన జరిపారు. వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు.. ఈ ముప్పు 48 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 
 
స్పెయిన్‌లో 2003-2009 వరకూ 55-80 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 3,614 మంది టైప్‌2 డయాబెటిస్‌ రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. 
 
సాధారణంగా మన కంటిలోని రె టీనాలో ఒమెగా-3 పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి