కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం... అరకేజీ ఉల్లిపాయతరుగు... వంద గ్రా. చెక్కా, లవంగాలు... చెరో 5 గ్రా. యాలక్కాయలు... 5 గ్రా. పసుపుపొడి... కాస్తంత కుంకుమపువ్వు... ఒక గ్రా. పాలు... పది మిల్లీ లీటర్లు వాల్నట్ గింజలు, జీడిపప్పులు ... చెరో 20 గ్రా. మంచినీరు... ఒక లీ. ఉప్పు... రుచికి సరిపడా
తయారీ విధానం : బియ్యాన్ని శుభ్రం చేసి మంచినీటిలో నానబెట్టి ఉంచాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక.. ఉల్లిపాయ తరుగు వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే వాల్నట్, జీడిపప్పులను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాత్రలో పైన చెప్పుకున్న చెక్కా, లవంగాలు, యాలక్కాయలను వేసి, మరికాస్త నూనె పోసి వేయించాలి. అందులోనే పసుపు పొడి, కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసి వేయించాలి. అలా కాసేపు వేగిన తరువాత పాలలో కొద్దిగా కుంకుమపువ్వును కలిపి అందులో పోయాలి.
ఆ తరువాత వేడి చేసిన ఒక లీటర్ నీటిని పై మిశ్రమంలో పోసి.. గడ్డలు కట్టకుండా బాగా కలియబెట్టాలి. బియ్యం ఉడుకుతుండగా మిగిలిన మరికాస్త కుంకుమ పువ్వును కూడా వేసి కలియబెట్టాలి. బియ్యం బాగా ఉడికి.. అన్నం పొడి పొడిగా అయ్యాక దించేయాలి.
చివరగా పైన తయారు చేసుకున్న అన్నాన్ని సర్వింగ్ డిష్లోకి మార్చి... పైన వేయించి ఉంచుకున్న ఉల్లిపాయలు, వాల్నట్, జీడిపప్పులతో అలంకరించి వడ్డించాలి. అంతే కాశ్మీరీ పులావ్ రెడీ అయినట్లే...!