కావలసిన పదార్థాలు : పచ్చిబియ్యం పిండి... అరకిలో పచ్చికొబ్బరి తురుము... ఒక పూర్తి కాయది మంచినీరు... సరిపడా ఉప్పు... సరిపడా పంచదార... సరిపడా
తయారీ విధానం : మంచినీటిలో సరిపడేంత ఉప్పును కలుపుకోవాలి. పచ్చిబియ్యం పిండిని తీసుకుని అందులో ఉప్పు కలిపిన నీటిని కొంచెం కొంచెం చల్లుతూ పొడిపొడిగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... నీరు చల్లి పిండిని కలుపుతున్నప్పుడు పిండి గడ్డకట్టకుండా పొడిపొడిగానే ఉండేటట్లు చూడాలి.
ఇప్పుడు పుట్టును తయారు చేసే పాత్ర అడుగు భాగంలో నీటిని పోసి, దానిపై పై భాగంలో ఉన్న గొట్టం లాంటి దాంట్లో పొడి పొడిగా తడి చేసుకున్న బియ్యంపిండిని కొంత, మరికొంత కొబ్బరితురుము, మళ్ళీ బియ్యంపిండిని వేసి గొట్టాన్ని నింపాలి. దీనిని ఆవిరిపైనే 10 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత ఉడికిన పుట్టును ఏదేని గరిటె చివరి భాగంతో నెట్టి పాత్రలోకి తీసుకోవాలి.
ఇలా తయారైన పుట్టుతోపాటు అప్పడం, పంచదార, కొబ్బరితురుము, కేరళ అరటిపండు ముక్కలతో పాటు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా మొలకెత్తిన పెసలతో తయారు చేసుకున్న కూరతో కలిపి తింటే మరింత రుచికరంగా ఉంటుంది. కేరళ ప్రజలు చాలా ఇష్టంగా తినే వంటకాన్ని తయారు చేసి, రుచి చూసేందుకు మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!