ఇరాన్ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడంపై ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద మందికిపైగా ఇరాన్ ఎంపీలు నెజాద్ విజయంపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ నెల 12న జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ భారీ విజయం సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వేడుకకు 100 మందికిపైగా ఇరాన్ ఎంపీలు హాజరుకాకుండా నిరసన తెలిపారని గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్లోని మొత్తం 290 మంది ఎంపీలలో, వారిలో 105 మంది నెజాద్ విజయ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ నెజాద్ ప్రత్యర్థుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. గత పది రోజులగా నెజాద్ విజయాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాల వలన ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్న మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావితో సమావేశమైన 70 మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులను ఇరాన్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. ఈ విషయాన్ని మీర్ హుస్సేన్ మౌసావి వెబ్సైట్ వెల్లడించింది. అధ్యాపకులను అరెస్టు చేసి ఎక్కడి తీసుకెళ్లారో కూడా తెలియదని ఆ వెబ్సైట్ పేర్కొంది.