సైనిక వివాదాలకు దూరంగా అమెరికా, చైనా

అమెరికా, చైనా ప్రభుత్వాలు సముద్రంపై సైనిక వివాదాలకు దూరంగా ఉండాని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాల మధ్య జరిగిన తాజా చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య నౌకా దళ వివాదాలు అంతర్జాతీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉందని అమెరికా, చైనా ప్రభుత్వాలు గుర్తించాయి.

అమెరికా, చైనా మధ్య జరిగిన తాజా చర్చల వివరాలను బీజింగ్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో గత ఏడాది నుంచి ఇరుదేశాల నౌకా దళాల మధ్య వరుసగా వివాదాలు నెలకొంటూనే ఉన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మిలిటరీ ఉన్నతాధికారులు ఉద్రిక్తతలను తగ్గించడంపై చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరగడం గత 18 నెలల్లో ఇదే తొలిసారి.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా యుద్ధ నౌకలు పరస్పర దాడులకు చాలాసార్లు సన్నద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఈ ప్రయత్నాలను విరమించుకున్నాయి. ఇటీవల చైనా జలాంతర్గామి అమెరికా యుద్ధ నౌకకు చెందిన ఓ సాంకేతిక వ్యవస్థను ఢీకొంది. ఇటువంటి సంఘటనలేవైనా అంతర్జాతీయ సంక్షోభాన్ని సృష్టించగలవని ఇరుదేశాల అధికారులు తాజా సమావేశంలో ఉద్ఘాటించారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాతర క్షిపణి ప్రయోగాలు జరుపుతుండటం కూడా ఇరుదేశాల మిలిటరీ అధిపతుల సమావేశంలో చర్చకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధనౌకల గస్తీని తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా అమెరికా రక్షణ శాఖ సహాయకార్యదర్శి మిచెలే ఫ్లోర్నోయ్ నేతృత్వంలోని అధికార బృందానికి స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి