కాశ్మీర్ అంశంలోకి మమ్మల్ని లాగొద్దు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘాన్

సోమవారం, 19 ఆగస్టు 2019 (13:27 IST)
కాశ్మీర్ అంశంలోకి తమను లాగొద్దని పాకిస్థాన్‌కు అప్ఘనిస్థాన్ తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో అప్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అప్ఘనిస్థాన్ ఒకింత ఘాటుగానే స్పందించింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అప్ఘాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశానికి హితవు పలికింది. 
 
ఈ మేరకు అమెరికాకు అప్ఘానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ ఓ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. 'అమెరికాకు పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అఫ్గానిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితం. పాక్‌కు అప్ఘాన్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 
 
ముఖ్యంగా, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వేలాంది మంది మిలటరీ బృందాలను ఎందుకు పెట్టిందో మాకు సరైన కారణం కనిపించడంలేదు. పాకిస్థాన్‌లో ఉండే ఉగ్రవాదుల నుంచి అప్ఘాన్‌కు తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మా దేశం వైపు ఉసిగొల్పేలా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక వేళ ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలి. ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలి' అని లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు