చైనాకు సుఖోయ్ జీ-5 యుద్ధ విమానాలు... భారత్‌పై దాడికేనా?

సోమవారం, 2 జనవరి 2017 (14:37 IST)
భారత్ శత్రుదేశం చైనాకు రష్యా ఉన్నట్టుండి సుఖోయ్-35 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. ఐదోతరం (జీ-5)కు చెందిన ఈ సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యా - చైనా దేశాల మధ్య రెండేళ్ళ కిందటే ఒప్పందం జరిగింది. అప్పటినుంచి ఈ విమానాలను అందించడంలో తీవ్ర జాప్యం చేసిన రష్యా.. ఇపుడు ఆకస్మికంగా నాలుగు యుద్ధ విమానాలను అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనివల్ల భారత్ - చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ యుద్ధ విమానాల కోసం చైనా గత రెండేళ్లుగా నిరీక్షించింది. కానీ రష్యా నుంచి స్పందన లేకపోవడంతో చైనా సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టిసారించింది. ఇప్పటికే అక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ‘జె-20’ పేరిట కొత్త విమానాన్ని ఆవిష్కరించింది కూడా. దీంతో అక్కడి మార్కెట్లో సుఖోయ్ విమానాలకు విలువ తగ్గుతుందన్న ఆందోళనతో రష్యా చకచకా డీల్ ఓకే చేసినట్టు చెబుతున్నారు. 
 
కాగా భారత వైమానిక దళం వద్ద ఉన్న సుఖోయ్-30 విమానాలకంటే సుఖోయ్-35 రకానికి చెందిన విమానాలు మరింత సామర్థ్యంతో పనిచేస్తాయి. అత్యాధునికమైనవి కూడా. ఈ విమానాలపై చైనా కూడా ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రష్యా నుంచి డిసెంబర్ 25న యుద్ధవిమానాలు అందినట్టు చైనా ఆర్మీ ప్రకటించింది. తాజా పరిణామాలతో మళ్లీ చైనా, రష్యాల మధ్య సంబంధాలు బలపడతాయని, అదేసమయంలో భారత్ - చైనాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి