24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్

మంగళవారం, 5 ఆగస్టు 2025 (21:49 IST)
భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. మరో 24 గంటల్లో భారత్‌కు గట్టి షాక్ ఇస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై విధస్తున్న సుంకాలను వచ్చే 24 గంటల్లో మరింత పెంచబోతున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు 7 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించినప్పటికీ ఆ రేటును మరింత పెంచుతామని స్పష్టం చేయడం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉంది. 
 
డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'భారత్‌లో అత్యధిక సుంకాలు ఉన్నాయి. మేము భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేస్తాం. ముందు 25 శాతానికి అంగీకరించాం. కానీ, రాబోయే 24 గంటల్లో దాన్ని గణనీయంగా పెంచాలని నేను భావిస్తున్నాను' అని ట్రంప్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. రష్యా యుద్ధానికి భారత్ తన చమురు కొనుగోళ్ల ద్వారా ఆర్థికంగా సహకరిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
ఇదిలావుంటే, ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై భారీగా సుంకాలను విధించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. అమెరికాలో ఔషధాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సుంకాలు క్రమంగా 250 శాతం వరకు చేరవచ్చని స్పష్టం చేశారు. 
 
మొదట తక్కువ శాతంతో సుంకాలు ప్రారంభమవుతాయని, యేడాది నుంచి 18 నెలలు వ్యవధిలో వీటిని 150 శాతం, ఆ తర్వాత 250 శాతానికి పెంచుతామని ట్రంప్ వివరించారు. మా దేశంలోనే ఫార్మాస్యుటికల్ తయారు కావాలని మేము కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల్లో విదేశీ సెమీకండక్టర్లు, చిప్‌లపై కూడా సుంకాలు విధిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు