సైనిక నిధులన్నీ అప్పుగా మార్చండి.. పాకిస్థాన్‌కు డోనాల్డ్ ట్రంప్ షాక్

బుధవారం, 24 మే 2017 (08:54 IST)
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేరుకోలేని షాకిచ్చారు. పాకిస్థాన్‌కు సైనిక కొనుగోళ్లకు సంబంధించి పాకిస్థాన్‌కు ఇచ్చిన నిధులను అప్పుగా మార్చాలని కాంగ్రెస్‌ను ట్రంప్ ఆదేశిస్తూ... దీనిపై తుది నిర్ణయం తీసుకునే విషయాన్ని విదేశాంగ శాఖకు అప్పగించారు. ఈ ఆదేశాలు పాకిస్థాన్‌కు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
 
అంతేకాకుండా, లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూసేందుకు అమెరికా గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ)తో చేతులు కలిపింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై అమెరికా, జీసీసీ సభ్య దేశాలైన బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ సంతకాలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. 
 
అలాగే, పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లే విషయంపై అమెరికా తమ దేశ పౌరులను హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాద ముప్పు పెరిగిన దృష్ట్యా ఆ దేశానికి అత్యవసరంకాని ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించింది. 45 రోజుల వ్యవధిలో ఇలాంటి సూచన చేయడమిది రెండోసారి. 

వెబ్దునియా పై చదవండి