పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత ఆర్మీ జరిపిన దాడులకు ప్రతీకారం ఏదోవిధంగా తీర్చుకోవాలన్న పట్టుదలతో హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఇందులోభాగంగా, భారతదేశంలో భారీ విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు భారత నిఘా సంస్థలు పక్కా సమాచారాన్ని సేకరించాయి.
జమ్మూకాశ్మీర్లోని భారత సైన్యంపై త్వరలో సర్జికల్ దాడులకు పాల్పడతామని జమ్మత్-ఉద్-దవా చీఫ్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ స్వయంగా ప్రకటించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మిర్పూర్లో జరిగిన భారీ సభలో హఫీజ్ పాల్గొని ప్రసంగించాడు. భారత్కు సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా సర్జికల్ దాడులుచేస్తామని హెచ్చరించాడు.
సరిహద్దుల్లో సర్జికల్ దాడులకు పాల్పడటంతోపాటు భారతదేశంలోని ప్రధాన పట్టణాల్లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా వ్యూహరచన చేస్తోంది. భారత - పాక్ సరిహద్దుల వెంబడి ప్రవహిస్తున్న నిక్కీ తావి, బడి తావి నదులద్వారా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు.