పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు - ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

ఆదివారం, 22 మే 2022 (13:23 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈయన పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌పై తన అక్కసును వెళ్ళగక్కారు. పలుమార్లు అర్థరహిత ఆరోపణలు చేశారు. ఇపుడు పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడంపై ఆయన స్పందించారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందన్నారు. క్వాడ్‌ కూటమిలో ఉన్నప్పటికీ.. భారత్‌ తమ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసమే అలా చేసిందని వివరించారు. 
 
భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండడం వల్లే అది సాధ్యమైందన్నారు. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు సంబంధించిన మీడియా కథనాన్ని ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. తాను అధికారంలో ఉండగా.. తమ ప్రభుత్వం కూడా ప్రత్యేక విదేశాంగ విధానం కోసం కృషి చేసిందన్నారు. 
 
కానీ, స్థానిక మీర్‌ జాఫర్లు, మీర్‌ సాదిక్‌లు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని పరోక్షంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు