ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నారని పాకిస్థాన్ ఉప ప్రధాని, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి మూడో దేశ జోక్యానికి భారత్ ససేమిరా అందని, ఏ మాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. ప్రధానంగా 'ఆపరేషన్ సింధూర్' సమయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో మూడో దేశం ప్రమేయాన్ని భారత్ మొదటి నుంచీ నిరాకరించిందని ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని తనకు అప్పటి అమెరికా రక్షణ మంత్రి మార్క్ రుబియో స్వయంగా చెప్పారని దార్ వివరించారు.
జులై 25వ తేదీన తాను మార్క్ రుబియోతో సమావేశమయ్యానని ఇషాక్ దార్ గుర్తుచేసుకున్నారు. 'ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ నివారణకు భారత్ ఎలాంటి చర్చలు జరిపారని తాను రుబియోను అడిగానని తెలిపారు. దీనికి బదులుగా, ఈ వివాదంలో ఏ మూడో దేశం జోక్యాన్నైనా భారత్ కోరుకోలేదని, దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే పరిగణించిందని రుబియో స్పష్టం చేశారని దార్ వెల్లడించారు.
గత మే నెలలో పహల్గాం దాడి తర్వాత 'ఆపరేషన్ సింధూర్' జరిగిన విషయం తెలిసిందే. తమపై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ ఎన్నో సార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్నత స్థాయి మంత్రి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం, భారత వైఖరిని బలపరిచినట్లయింది. దీంతో ట్రంప్ ప్రచారంలో వాస్తవం లేదని అంతర్జాతీయంగా మరోసారి రుజువైనట్లయింది.