భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌ అథానోమ్

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:30 IST)
భారతదేశంలో కరోనా వైరస్‌ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే హృదయ విదారకస్థితిని మించిపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది. 
 
ఇదే అంశంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తోంది. వైద్య సామగ్రి, వేలాదిగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ల్యాబోరేటరీ పరికరాలు అందిస్తోంది. 
 
అంతేకాకుండా భారత్‌కు సిబ్బంది సహకారం అందించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ముందడుగు వేసింది. అందులో భాగంగా 2,600 మంది వైద్య నిపుణుల్ని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే భారత్‌కు బదిలీ చేస్తూ ప్రకటించినట్లు’ టెడ్రస్‌ తెలిపారు. 
 
మరోవైపు, కరోనా ఉద్ధృతితో ఆపత్కాలంలో ఉన్న తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్‌కు తక్షణ సాయంగా బ్రిటన్‌ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాచీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. 
 
‘అంతర్జాతీయ సహకారం కార్యరూపం దాల్చింది. ఆపత్కాలంలో భారత్‌కు సహకారం అందిస్తున్న బ్రిటన్‌కు అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరుకున్నాయి’ అని బాగ్చీ ట్వీట్‌లో పేర్కొన్నారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ద్వారా వైద్య సామగ్రి భారత్‌కు చేరిన ఫొటోలను ఆయన ట్వీట్‌లో పంచుకున్నారు.
 
భారత్‌లో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న వేళ పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బ్రిటన్‌ కూడా భారత్‌కు సహకారం అందిస్తామని ప్రకటించింది. దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ స్పందిస్తూ.. ఈ వారంలో 495 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 120 నాన్‌ ఇన్వేసివ్‌ వెంటిలేటర్లు, 20 మ్యానువల్‌ వెంటిలేటర్లు బ్రిటన్‌ నుంచి పంపనున్నట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు