ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం భారతదేశ బాస్మతి బియ్యం వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఈ పరిస్థితి కనుక త్వరలో మెరుగుపడకపోతే చెల్లింపు సంక్షోభం, తీవ్ర ధరల తగ్గుదలతో ఇబ్బందులు తప్పవని ఎగుమతిదారులు హెచ్చరించారు.
"ఇరాన్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. భారతదేశం మొత్తం బియ్యం ఎగుమతుల్లో దాదాపు 18 నుండి 20 శాతం ఇరాన్కు వెళుతుంది. ప్రతి సంవత్సరం, మేము దాదాపు 1 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని వారికి ఎగుమతి చేస్తాము" అని గోయల్ అన్నారు. ప్రస్తుతం ఏర్పడిన అంతరాయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వాణిజ్యంలో ఇంకా పూర్తిగా నిలిచిపోనప్పటికీ, షిప్మెంట్లలో జాప్యం, చెల్లింపుల చుట్టూ అనిశ్చితి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుందని గోయెల్ అన్నారు. "ఈ వివాదం కొనసాగితే, స్థానిక మార్కెట్ నగదు కొరతను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి మరింత దిగజారితే, ఈ క్షీణత మరింత తీవ్రమవుతుంది" అని గోయెల్ చెప్పారు.
"సంఘర్షణ ప్రాంతాలలోకి ప్రవేశించే నౌకలకు యుద్ధ ప్రమాదాన్ని ఏ బీమా కంపెనీ కవర్ చేయదు. అంటే రవాణా సమయంలో ఏదైనా జరిగితే, ఎగుమతిదారులే పూర్తి నష్టాన్ని భరిస్తారు" అని గోయల్ పేర్కొన్నారు. అమెరికా వివాదంలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని కూడా గోయల్ ఎత్తి చూపారు.