ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో తమ దేశ పౌరులకు ఇరాన్ ఓ హెచ్చరిక చేసింది. తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను తక్షణం తొలగించాలని ఇరాన్ ప్రభుత్వం సంచలన సూచన చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ నుంచి సేకరించి ఇజ్రాయెల్కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట ఆధారాలను ఇరాన్ ప్రభుత్వం బయటపెట్టలేదు. తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తల కదలికలను సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఇజ్రాయెల్ వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఆరోపణలపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణల ద్వారా భవిష్యత్లో మా సేవలను ప్రజలకు అందకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నాం. మేము యూజర్ల లొకేషన్లను ట్రాక్ చేయం. వారి కార్యకలాపాలకు సంబంధించిన లాగ్లను కూడా మేం నిర్వహించం. వ్యక్తిగత సందేసాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడం. ఏ ప్రభుత్వంతోనూ పెద్ద మొత్తంలో సమాచారాన్ని షేర్ చేసుకోం అని వాట్సాప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.