ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. అయితే. తమ దేశంపై కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడవచ్చన్న భయంతో ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మరోవైపు, ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ సైనిక వర్గాల సమాచారం మేరకు.. ఇరాన్పై జరిగిన ఆపరేషన్లో డజన్ల కొద్దీ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, సైనిక కమాండ్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపనట్టు పేర్కొంది. ఇరాన్ దాదాపు 15 అణు వార్ హెడ్లకు సరిపడా శుద్ధి చేసిన యురేనియం నిల్వ చేసిందని, ప్రయోగించగల అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కొన్ని నెలల దూరంలోనే ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.