ఆడపిల్లల వివాహ వయసు 20 యేళ్ళు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని నేపాల్ ప్రభుత్వం అంటోంది. అందుకే ఆడపిల్లల వివాహ వయసును 20 యేళ్ల నుంచి 18 యేళ్ళకు తగ్గించేందుకు సిద్ధమవుతోంది. వివాహ వయసు 20 యేళ్లుగా ఉండటం వల్ల అత్యాచారాలు పెరగడానికి కారణం అవుతోందని, అందువల్ల నేరాలను అరికట్టేందుకు వీలుగా బాలల చట్టం, క్రిమినల్ కోడ్ సవరించాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ప్రస్తుతం వివాహ వయసు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మోడళ్ళపై పని చేస్తుందని మంత్రి అజయ్ చౌరాసియా వెల్లడించారు. ఇందులో మొదట వివాహ వయసును తగ్గించడం కాగా, రెండోది రోమియో జూలియట్ చట్టం. ఈ చట్టం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో వుంది. ఈ చట్టం ప్రకారం వివాహం కాకున్నా, నిర్ధేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీయువకులు శృంగారంలో పాల్గొన్నా దానిని అత్యాచారంగా పరిగణించరు. అయితే వారి మధ్య మూడేళ్ల వ్యత్యాసం మాత్రం ఖచ్చితంగా ఉండితీరాల్సివుంది.
నేపాల్లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2017 ప్రకారం 18 యేళ్ళలోపు యువతితో లైంగిక సంబంధం నెరిపితే దానిని లైంగికదాడిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆ యువతి అంగీకారమున్నప్పటికీ చట్టం మాత్రం అంగీకరించదు. దీంతో వేల మంది యువకులు 18 యేళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నేరంగా పరిగణించడంతో బాల్య వివాహ నేరంతో పాటు అత్యాచార కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వయసు 18 యేళ్లకు తగ్గించాలని నిర్ణయించింది.