ఈ తేదీల్లో.. ఆకాశంలో భారీ మార్పులు?!..ఎందుకో తెలుసా

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:41 IST)
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఎన్నో వేల మందిని బలితీసుకుంది. అయితే మహమ్మారి రాకతో లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలుష్య తీవ్రత తగ్గుతోంది. కాలుష్య కోరల నుంచి భూమి తనని తాను రక్షించుకుంటుందని ప్రకృతి ప్రేమికులు సంతోషిస్తున్నారు.

అయితే ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇటీవల ఆకాశంలో మార్పులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఏప్రిల్‌ 7వ తేదీన పింక్‌ సూపర్‌ మూన్‌ని ఆస్వాదించారు. తాజాగా మరో ఖగోళ సంఘటన జరగనుంది.
చంద్రుడితో గురుడు, శని, అంగారక గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.

ఈ ఖగోళ సంఘటన ఏప్రిల్‌ 14, 15, 16వ తేదీల్లో జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో బైనాక్యులర్స్‌, టెలిస్కోప్‌ సాయం లేకుండానే ఆ రమణీయమైన దృశ్యాన్ని నేరుగా ఆస్వాదించవచ్చని చెప్పారు.

గురుడు, శని, అంగారక గ్రహాలని మార్నింగ్‌ ప్లానెట్స్‌ అని అంటారు. అంటే అవి ఉదయాన స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఏప్రిల్‌ మధ్యలో ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో కన్పిస్తుంటాయి. అయితే వాటితో పాటు ఈ సారి చంద్రుడు కూడా అదే వరుసలో కనిపించనున్నాడు. ఏప్రిల్‌ 14, 15, 16వ తేదీల తర్వాత అంగారక గ్రహం వీటి నుంచి దూరంగా కదులుతుంది.

అయితే ఈ మూడు రోజులు చంద్రుడిని గమనిస్తే.. సమీపంలోనే ఆ మూడు గ్రహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోసారి ఈ మూడు మార్నింగ్‌ ప్లానెట్స్‌ కలిసి ఒకే వరుసలో రావడానికి మరో రెండేళ్లు పడుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు