ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే పనిలో పాక్ బిజీ

శనివారం, 19 అక్టోబరు 2019 (20:09 IST)
జమ్మూ కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే పనిలో బిజీ అయ్యింది పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్. రెక్కీ నిర్వహించిందని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.

చలికాలంలో భారత్‌-పాక్ సరిహద్దుల్లో మంచు కురుస్తుండటంతో.. ఇదే సరైన సమయంగా ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ భావిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలని గైడ్స్‌ను కోరినట్టు మన నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. గురేజ్ సెక్టారులో రెక్కీ జరిపారని తెలీడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.
 
ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాకిస్తాన్‌ టెక్నాలజీని వాడుకుంటోంది. మన సైనిక శిబిరాల జీపీఎస్ లొకేషన్లను గుర్తించి మ్యాప్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. మన సైన్యం కంట పడకుండా ముష్కరులను బోర్డర్‌ దాటించే కుట్రలు సాగుతున్నాయి.

పాక్ నుంచి నియంత్రణ రేఖ దాటి సరిహద్దు గ్రామాల్లోకి చొరబడి అక్కడి ఇళ్లలో ఆశ్రయం తీసుకునేందుకు పాక్ పథకం రూపొందించింది. ప్రత్యేకించి గురేజ్ సెక్టార్‌ అతవల పీవోకేలో.. పాకిస్థాన్ అదనపు సైనిక దళాలు తిరుగుతున్నాయని మన నిఘా వర్గాలకు సమాచారం అందింది.

సరిహద్దుల్లోని మీనీమార్గ్, కమ్రీ, దొమ్మేల్, గుల్టారీ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పోస్టులతోపాటు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. గిల్జిత్, చిల్లాం శిబిరాల నుంచి పెద్దఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రిని సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలకు తరలించారు. భారత బలగాలు సైతం అప్రమత్తం కావడంతో.. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు