పర్మిషన్ లేకుండా పిరమిడ్ వద్ద ఫోటో షూట్.. మోడల్ - ఫోటోగ్రాఫర్ అరెస్టు!

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (08:15 IST)
పురావస్తు ప్రదేశంలో ముందస్తు అనుమతి లేకుండా ఫోటోషూట్ చేయడం నేరం. అందుకే ఈజిప్టు పిరమిడ్స్ వద్ద ఫోటోషూట్‌లో పాల్గొన్న మోడల్‌తో పాటు ఫోటోగ్రాఫర్‌ను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ 500 పౌండ్ల అపరాధం చెల్లించిన పిదప బెయిలుపై విడుదల చేశారు. 
 
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో ఈజిప్టు రాజధాని కైరోలోని జొజర్ పిరమిడ్స్ ఒకటి. ఇవి కైరోకు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ పిరమిడ్స్ ముందు ఫోటోలు దిగాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సివుంది. ఎందుకంటే.. ఈ ప్రాంతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. 
 
కానీ, మోడల్ సల్మా అల్-షిమి ఎలాంటి అనుమతి లేకుండా ఈజిప్టు దుస్తులు, నగలు ధరించి ఫోటోషూట్‌లో పాల్గొంది. ఆ తర్వాత టిక్‌టాక్‌ వీడియో తయారు చేసింది. ఈ వీడియోను గత వారం షిమి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. 
 
ఈ వీడియోలో ఆమె జోజర్‌కు చెందిన 4,700 ఏండ్ల స్టెప్ పిరమిడ్ కింది భాగంలో పోజులిచ్చింది. ఈ ఈజిప్టు మోడల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈజిప్ట్ పురాతన వారసత్వంతో విభేదించే దుస్తులను ధరించినందుకు మోడల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. ఫొటో షూట్‌ కోసం పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
మోడల్‌ షిమితోపాటు ఫొటోగ్రాఫర్ హౌసం మొహమ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, 500 ఈజిప్టు పౌండ్లు చెల్లించిన మీదట వీరిద్దరికీ బెయిల్‌ మంజూరైంది. మోడల్‌ షిమితో పాటు ఫొటోగ్రాఫర్‌ను అరెస్ట్‌ చేయడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు