నోబెల్ శాంతి బహుమతి విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారంటూ అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం అభిప్రాయపడింది. ఈ యేడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనాను ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ యేడాది నోబెల్ పురస్కారం అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడి కల ఒక కలగానే మిగిలిపోయింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని విమర్శించింది.
తాజా పరిణామాలపై వైట్హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ మాట్లాడారు. 'నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించింది. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారు. ఆయన మానవతావాది. తన సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరు' అని చుయెంగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కల ఈనాటిది కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయన తన ఆకాంక్షను బయటపెట్టారు. అయిత, రెండోదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నోబెల్ వచ్చి తీరాల్సిందే అన్న స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఎన్నో యుద్ధాలను ఆపానని, ప్రపంచ శాంతిని కోరుకుంటున్న తనకు ఇచ్చి తీరాల్సిందేనంటూ బహిరంగ ప్రకటనలు ఇచ్చారు.