ధిక్కార స్వరం వినిపిస్తున్న ఇరాన్పై సైనిక చర్య చేపట్టాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. దీనిపై వచ్చే రెండు వారాల్లో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్పై చర్చలకు సిద్ధమని, అయితే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకమే ప్రధానమని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందో లేదో వేచి చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని వైట్హౌస్ పేర్కొంది. నిజానికి అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకుంటున్నారని, అవసరమైతే బలం ప్రయోగిస్తారని శ్వేతసౌథం వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ - ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో తీవ్రమవుతున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరులతో మాట్లాడుతూ, "సమీప భవిష్యత్తులో ఇరాన్తో చర్చలు జరిగే అవకాశం ఉన్నందున, దాడికి వెళ్లాలా? వద్దా? అనే దానిపై నేను రాబోయే రెండు వారాల్లో నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను" అని ట్రంప్ చెప్పినట్లు లెవిట్ తెలిపారు.
ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికి ట్రంప్ సుముఖంగా ఉన్నప్పటికీ, ఆ దేశం అణ్వాయుధాన్ని సంపాదించకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని లెవిట్ స్పష్టం చేశారు. ఏదైనా ఒప్పందం కుదిరితే, అది టెహ్రాన్ యురేనియం శుద్ధిని నిషేధించాలని, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయాలని షరతులు విధించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
"అధ్యక్షుడు ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారానికే ఆసక్తి చూపుతారు. ఆయన శాంతిని కాంక్షించే ముఖ్య నేత. బలంతో శాంతిని సాధించాలనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి దౌత్యానికి అవకాశం ఉంటే, అధ్యక్షుడు దానిని తప్పక అందిపుచ్చుకుంటారు. అయితే, అవసరమైతే బలాన్ని ఉపయోగించడానికి వెనుకాడరు" అని లెవిట్ వివరించారు.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందో లేదో చూసిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఇరాన్పై దాడి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా? అని అడిగినప్పుడు "నేను చేయవచ్చు, చేయకపోవచ్చు. వచ్చే వారం చాలా కీలకమైంది. బహుశా వారం కంటే తక్కువే కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.