పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

ఠాగూర్

ఆదివారం, 9 మార్చి 2025 (15:32 IST)
తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా ఓ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌లో పర్యటించరాదని హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాలకు అస్సలు వెళ్లవద్దని కోరింది. ఆయా  ప్రావిన్స్‌లలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. 
 
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్ళొద్దని కోరింది. ఆయా ప్రావిన్స్‌లలో ఎపుడు ఎక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనేది  చెప్పలేమని, పౌరులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్ర కార్యకలాపాలతో పాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. పాకిస్థాన్ వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 
 
మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాల్లో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. ఇందులో లైఫ్ ఆఫ్ కంట్రోల్ ఏరియాకు అస్సలు ప్రయాణించవద్దంటూ లెవల్ 4 హెచ్చరికలను జారీచేసింది. సరిహద్దుల్లో మిలిటెంట్ గ్రూపులు దాడులు చేయొచ్చని, సరిహద్దులకు రెండు వైపులా రెండు దేశాలు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మొహరించాయని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు