రష్యా విమానంపై పిడుగు పడటం వల్లే ప్రమాదం

సోమవారం, 6 మే 2019 (12:55 IST)
విమానయాన చరిత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పిడుగు పడటంతో విమానం వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా విమానం ముందుభాగానికి వ్యాపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకుగురైన ప్రయాణీకులు ముందుభాగంలో తెరుచుకున్న అత్యవసర ద్వారం గుండా బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
నిజానికి ఈ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో విమానం నేలకు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగినట్టు వార్తలు వచ్చాయి. కానీ, విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో వెనుకభాగంలో పిడుగుపడటంతో మంటలు వ్యాపించాయని నిపుణుల బృందం తేల్చింది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం రాజధాని మాస్కోలోని షెరెమెత్యేవో విమానాశ్రయంలో టేకాఫ్‌ తీసుకున్న సుఖోయి సూపర్‌జెట్ విమానంలో కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ క్రమంలో విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలతోనే విమానం రన్‌‌వే‌పై పరుగులు పెట్టింది. ఇటు హుటాహుటిన విమానంలోని అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఎమర్జెన్సీ ద్వారంగుండా 37 మంది ప్రయాణీకులు బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు