సాధారణంగా పాఠశాలలు, కళాశాలల్లో స్కాలర్షిప్లు రావాలంటే మంచి మార్కులు, అర్హత ఉంటే చాలు. అయితే దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులా నాతల్ రాష్ట్రంలోని ఉతుకెలా జిల్లాలో మాత్రం స్కాలర్షిప్ కావాలనుకునే బాలికలు, యువతులకు ఉండాల్సిన అర్హత ఏంటో తెలుసా.. కన్యగా ఉండడమే. అయితే ఇలా నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు.
ఆ వివరాల్లోకి వెళితే అక్కడ పలువురు బాలికలు చదువు పూర్తయ్యేలోపు గర్భం దాలుస్తున్నారు. అంతేగాక, అక్కడి విద్యాశాఖ అందించిన వివరాల ప్రకారం.. పాఠశాలల్లోనే గర్భందాల్చిన బాలికల సంఖ్య ఇప్పటివరకు దాదాపు 20,000. ఇలా చిన్న వయసులోనే గర్భధారణను అరికట్టేందుకు, హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడేందుకు... బాలికల చదువు పూర్తయ్యే వరకు పూర్తిగా దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తూ ఆ ప్రాంత మేయర్ ఈ స్కాలర్షిప్ పథకాలను అమలు చేశారు.
స్కాలర్షిప్లు కావాలనుకునే వారు కన్యత్వ పరీక్షల్లో నెగ్గాలట. అయితే ఈ నిర్ణయంపై కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు మండిపడుతున్నారు. కన్యత్వ పరీక్షలు నిర్వహించడం సరికాదని అంటున్నారు. దీనిపై హక్కుల సంఘాలు జెండర్ కమిషన్లో పిటిషన్ వేశాయి. జెండర్ కమిషన్ ఈ ఉత్తర్వు చెల్లదని తీర్పునిచ్చింది. మహిళలకు కన్యత్వ పరీక్షలు చేసి యూనివర్శిటీ స్కాలర్ షిప్లు ఇస్తే, పురుషులకు ఎలా పరీక్షలు నిర్వహిస్తారని ప్రశ్న వచ్చింది. అయితే ఆ ప్రాంత మేయర్ డుడు మజిబుకో మాత్రం ఇది బాలికల మంచికేనని వారి సమ్మతితో కన్యత్వ పరీక్షలు జరపడం చట్ట విరుద్ధం కాదని వెల్లడించారు.