ముగిసిన మోడీ బంగ్లాదేశ్‌ పర్యటన.. రెచ్చిపోయిన ఇస్లామిస్ట్ ఆందోళనకారులు

సోమవారం, 29 మార్చి 2021 (10:18 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆయన పర్యటన ముగియగానే మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన ఇస్లామిస్ట్ గ్రూపుకు చెందిన ఆందోళనకారులు రెచ్చిపోయారు. తూర్పు బంగ్లాదేశ్ పరిధిలోని పలు దేవాలయాలపై దాడికి దిగారు. ఓ రైలును కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నిరసనలకు సంబంధించి ఇప్పటివరకూ 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ ఢాకాను వీడిన తర్వాత మరింతగా హెచ్చుమీరాయాని మీడియా పేర్కొంది. 
 
కాగా, బంగ్లాదేశ్ 50వ జాతీయోత్సవం సందర్భంగా మోడీ శుక్రవారం ఢాకాకు చేరుకుని, రెండు రోజుల పాటు పర్యటించి, శనివారం రాత్రి తిరిగి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. మోడీ పాలనలో ఇండియాలో ముస్లింలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తున్న ఇస్లామిస్ట్ గ్రూపులు, ఈ నిరసనలకుదిగాయి. 
 
నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లను ప్రయోగించగా, పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలు అయ్యాయి. వీధుల్లో ప్రదర్శనలకు దిగుతున్న వీరంతా, తమకు కనిపించిన దుకాణాలను నాశనం చేస్తున్నారు.
 
హిఫాజత్-ఏ-ఇస్లాం గ్రూప్ నిరసనకారులు ఇందుకు కారణమని పేర్కొన్న ఉన్నతాధికారులు, ఒక రైలు ఇంజన్ ను, అన్ని కోచ్‌లనూ ధ్వంసంచేశారని, బ్రహ్మన్ బారియా జిల్లాలో దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకుని వచ్చి ఫర్నీచర్‌ను నాశనం చేశారని, అక్కడి ప్రెస్ క్లబ్‌పైనా దాడికి దిగి, క్లబ్ అధ్యక్షుడిని గాయపరిచారని తెలిపారు.
 
రాజ్ షాహీ జిల్లాలో బస్సులపై దాడులు జరిగాయని, అక్కడి నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారని, కొందరు పోలీసులకూ గాయాలు అయ్యాయని అన్నారు. కాగా, తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, పోలీసులు తుపాకులు వాడి తమవారిని హతమారుస్తున్నారని ఇస్లామిస్ట్ గ్రూప్ నేతలు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు