టాంటాం చేసుకున్న మానవత్వం ఇదేనా? పాక్ తీరుపై భారత్ ధ్వజం

బుధవారం, 27 డిశెంబరు 2017 (09:54 IST)
గూఢచర్య అరోపణలపై అరెస్ట్‌ చేసి, మరణశిక్ష విధించిన భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌ను చూసేందుకు ఇస్లామాబాద్ వెళ్లిన ఆయన భార్య, తల్లి పట్ల పాకిస్థాన్ పాలకులు నడుచుకున్న తీరుపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాక్ దుర్నీతి ఎండగడుతూ కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
"పాక్‌ అతిగా టాంటాం చేసుకున్న మానవత్వం ఇదేనా? వారి సంస్కృతీ సంప్రదాయాలను ఇంత దారుణంగా అవమానిస్తారా? ఆ ఇద్దరు మహిళలను అడుగడుగునా వేధించారు, అవమానించారు.. ఈ భేటీ ఎంతో ఒత్తిడి మధ్య జరిగింది. ఆ మహిళలిద్దరూ చాలా ధైర్యంతో దీన్ని ఎదుర్కొన్నారు. అసలు కుల్‌భూషణ్‌ జాదవ్‌ అరెస్టే తప్పు. ఆయనపై అభియోగాలు అర్థంపర్థం లేనివి. భారత డిప్యూటీ హైకమిషనర్‌ లేకుండానే మీటింగ్‌ కానిచ్చేశారు. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకూ విరుద్ధం" అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అందులో ఘాటుగా పాక్‌ను విమర్శించారు.
 
అంతకుముందు పాక్ జైళ్ళలో మగ్గుతున్న కుల్‌భూషణ్ జాదవ్‌ను ఆయన భార్య, తల్లి ఇస్లామాబాద్ వెళ్లి కలిసివచ్చారు. అనంతరం వారిద్దరూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌‌ను, సహాయమంత్రులు ఎంజే అక్బర్‌, వీకే సింగ్‌‌లను, ఇతర అధికారులను కలిశారు. జరిగింది జరిగినట్లు చెప్పారు. తన కుమారుడి ఎడమ చెవి దగ్గర, బుగ్గమీద గాట్లున్నాయని, మనిషి నీరసించి కనిపిస్తున్నాడనీ, ఏదో శూన్యంలో చూస్తున్నట్లుగా కనిపించాడని, ఏదేనా కరెంట్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత బయటికి వచ్చిన పేషెంట్‌లా కనపించారనీ వారిద్దరూ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు