వచ్చేవారం మరింత కఠినం .. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. ట్రంప్ పిలుపు

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (17:01 IST)
కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అల్లకల్లోలమైపోయింది. ముఖ్యంగా న్యూయార్క్ మహానగరం శవాల దిబ్బగా కనిపిస్తోది. కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారిని ఖననం చేసేందుకు సరిపడ శ్మశానవాటికలు కూడా అందుబాటులో లేవు. దీంతో శవాలన్నీ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో నిల్వచేశారు. పైగా, ఒక మృతదేహాల ఖననం కోసం శ్మశానవాటికల వద్ద వరుస క్రమం పాటిస్తున్నారు. దీంతో రెండు మూడు రోజులపాటు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. అమెరికా చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ సంభవించలేదు. 
 
మరోవైపు, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు పిడుగులాంటి వార్త చెప్పారు. రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య పెరుగుతుందని జోస్యం చెప్పారు. చాలా క్లిష్టమైన వారం రోజుల సమయాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
'వచ్చే వారం రోజులు చాలా క్లిష్లమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మరణాలు సంభవిస్తాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, అత్యంత ప్రభావిత రాష్ట్రాలను ఆదుకుంటామని ట్రంప్ భరోసా ఇచ్చారు. వైద్య సదుపాయాలు కల్పిస్తూ, మిలిటరీ సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వేలాది మంది సైనికలు, వైద్య నిపుణులు సాయం అందిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లో 1,000 మంది మిలిటరీ సిబ్బంది మోహరించారని తెలిపారు.
 
అదేసమయంలో ఈస్టర్‌ రోజున సామాజిక దూరం నిబంధనలను సడలిస్తామన్నారు. 'మన దేశాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో మూడు లక్షల మందికి పైగా ప్రజలకు కరోనా వైరస్ సోకింది. 8,500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క శనివారం రోజునే 630 మంది ప్రాణాలు విడిచారు. దీన్నిబట్టే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు