భారతీయులకు శుభవార్త : కాంగ్రెస్ సభలో యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (15:06 IST)
అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ టెక్కీలతో పాటు.. అక్రమ వలసదారులకు ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్ బిల్లును అమెరికా కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదం తెలిపితే అమెరికాలో పౌరసత్వం పొందాలనుకునే లక్షలాది మందికి ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
 
ముఖ్యంగా, 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం, దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా తొలగింపు, హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములను అగ్రరాజ్యంలో పని చేసుకోవడానికి వీలు కల్పించే ప్రతిపాదనల అమలు కోసం జో బైడెన్ తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక యూఎస్ సిటిజెన్‌షిప్ యాక్ట్ 2021 బిల్లును కాంగ్రెస్ సభలో సెనేటర్ బాబ్​ మెనెండెజ్, కాంగ్రెస్ సభ్యురాలు లిండా సాంచెజ్ ప్రవేశపెట్టారు. 
 
ఈ బిల్లు కాంగ్రెస్‌లోని ఉభయ సభల(ప్రతినిధుల సభ, సెనేట్‌)లో ఆమోదం పొందడమే ఆలస్యం.. బైడెన్ సంతకంతో చట్ట రూపం దాల్చనుంది. ఇదే జరిగితే, మిలియన్ల మంది అక్రమ వలసదారులతో పాటు చట్టబద్ధంగా దేశంలో ఉంటున్నవారికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం వల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. 
 
అలాగే వార్షిక ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు కోటా పెరుగుతుంది. దీని వల్ల ప్రస్తుతం ఏడాదికి జారీ చేస్తున్న లక్ష 40 వేల గ్రీన్ కార్డులను లక్ష 70 వేలకు పెంచనున్నారు. దీంతో దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయులకు భారీ లబ్ధి చేరకూరనుంది. కాగా, ఇప్పటికే సుమారు 8 లక్షల మంది ఎన్నారైలు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం క్యూలో ఉన్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు