హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ స్పాటా? జగ్గారెడ్డి ప్రశ్న

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (17:45 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కొత్త పార్టీ పెట్టి షర్మిల తప్పు చేస్తున్నారని అన్నారు. తన తండ్రి వైయస్ పేరును నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే పొలిటికల్ టూరిస్ట్ స్పాటా? అని మండిపడ్డారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిల వీరందరూ అమిత్ షా వదిలిన బాణాలు అని అన్నారు.
 
కాగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా, వైఎస్ పుత్రికగా షర్మిల తెలంగాణాలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు. తన సోదరుడు జగన్‌తో తనకు సంబంధం లేదని... ఆయన దారి ఆయనదే, తన దారి తనదే అని చెప్పారు.
 
మరోవైపు, షర్మిల పార్టీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ సంగతి పక్కన పెడితే... తెలంగాణలో మాత్రం ఆమెకు రాజకీయ విమర్శలు ఎదురవుతున్నాయి. షర్మిల ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అని నేతలు విమర్శిస్తున్నారు. అలాగే, జగ్గారెడ్డి కూడా షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు