బ్యాంకుల్లోని రూ.70 వేల కోట్లు సీజ్ : బైడెన్ సంచలన నిర్ణయం

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:50 IST)
ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ తీవ్రవాదుల వశమైంది. దీంతో ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్‌‌ను టార్గెట్ చేసున్నారు. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదంగా అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది ఘోరమైన వైఫల్యమని దుయ్యబట్టారు.
 
తనపై విమర్శలకు స్పందించిన జో బైడెన్.. అవసరమైతే అఫ్గన్‌‌లో ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
అమెరికా బ్యాంకుల్లోని ఉన్న ఆప్ఘన్ నిధులపై ఆంక్షలు విధించింది. దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను (రూ.70వేల కోట్లు) సీజ్‌ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆప్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన ఈ నిధులు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా నిధులు సీజ్ చేసినట్టు అధికార యంత్రాంగం ధ్రువీకరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు