చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

ఠాగూర్

సోమవారం, 20 అక్టోబరు 2025 (11:21 IST)
రష్యా నుంచి భారీగా భారత్ చమురు దిగుమతులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు గట్టిగా హెచ్చరించారు. తమ హెచ్చరికలను బేఖాతర్ చేసి చమురు దిగుమతులు చేస్తే మున్ముందు భారీ సుంకాలు విధించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. అయితే, భారత్ మాత్రమే ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యా నుంచి యధావిధిగా చమురు దిగుమతులు చేస్తోంది. 
 
ఆయన తాజాగా విలేకరులతో మాట్లాడుతూ, "భారత ప్రధాని నరేంద్ర మోడీతో నేను మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ఆయన చెప్పారు అని తెలిపారు. అయితే, గతవారం ట్రంప్ ఇదే వాదన వినిపించినప్పుడు, భారత విదేశాంగ శాఖ దాన్ని ఖండించింది. అసలు ఆ రోజు ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. 
 
ఈ ఖండన గురించి విలేకరులు ప్రశ్నించగా, "వారు అలా చెప్పాలనుకుంటే చెప్పుకోనివ్వండి. కానీ, అప్పుడు వారు భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయదానికి వారు ఇష్టపడరు" అంటూ ట్రంప్ పరోక్షంగా బెదిరింపు ధోరణిలో సమాధానమిచ్చారు.
 
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఇంధన వ్యాపారాన్ని దెబ్బతీయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగానే రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా తక్కువ ధరకే చమురును విక్రయిస్తోంది. 
 
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, సముద్ర మార్గం ద్వారా రష్యా చమురును కొనుగోలు చేసే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. తమ దేశ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత్ మొదటి నుంచి చెబుతోంది.
 
ఇప్పటికే అమెరికా, భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. రష్యాతో జరిపే లావాదేవీల కారణంగా మరో 25 శాతం అదనపు జరిమానా కూడా ఇందులో ఉంది. ఇప్పుడు చమురు కొనుగోళ్లు ఆపకపోతే ఈ సుంకాలను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు, అంతర్జాతీయ కమోడిటీస్ డేటా సంస్థ 'కెప్లర్' అంచనాల ప్రకారం, అక్టోబరు నెలలో భారత్ దిగుమతులు సుమారు 20 శాతం పెరిగి, రోజుకు 1.9 మిలియన్ బ్యారెళ్లకు చేరనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి