అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

ఠాగూర్

శనివారం, 21 జూన్ 2025 (17:04 IST)
అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా లేదా మరో దేశం మద్దతు ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ పక్షాన చేరితో అది కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. 
 
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. 
 
ఈ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం గురించి అమెరికా అధ్యక్షుడు ఆలోచన చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన మార్గాలపై చర్చించేందుకు అరాఘ్చీ జెనీవాలో యూరోపియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. 
 
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు అమెరికా రహస్యంగా మద్దతు ఇస్తూ, మరోవైపు అణు ఒప్పందం చర్చలకు తమను ఆహ్వానించడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో అణు చర్చలు జరపడానికి ఇరాన్ సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు