త్యాగమంటే చెప్పి చేసేది కాదు. ఒక దేశ నాయకత్వాన్ని కాపాడేందుకు తన ప్రాణం తప్ప మరేదీ లేదనుకున్నప్పడు దాన్ని అడ్డేసి ప్రధానిని, మంత్రులను కాపాడేందుకు ముందుకొచ్చిన ఆ త్యాగం వెనుక తెగువను కొలవాలంటే మనిషి రూపొందించిన సాధనాలు సరిపోవు. ఆ త్యాగం ఒక దేశాన్ని కాపాడింది. ప్రాణాలొడ్డి మీరు ప్రశాంతంగా పాలించండంటూ నేలకొరిగింది. మృతకళేబరమై, విగతజీవియై కట్టెదుట నిలిచిన ప్రాణత్యాగానికి దేశం దేశం నిలువునా కరిగి నీరైంది. ఒక మహానగరం లక్షల గొంతుకల మౌన నివాళి అర్పించింది.
బ్రిటన్ పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటనలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ కీత్ పామర్ ఇప్పుడు బ్రిటన్ దేశాన్ని కాపాడిన హీరో. ఒక సాధారణ కానిస్టేబుల్ ఉగ్రవాదుల బుల్లెట్లకు నేల కొరిగితే లండన్ మహానగరమే అతడి వెన్నంటి కదలింది. చివరి నివాళి పలకడానకి గంటల పాటు మైళ్ల దూరం అతడి వెంట సాగి నడిచింది. సోమవారం నిర్వహించిన ఆ అంతిమయాత్రం బ్రిటన్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఆసాధారణ యాత్ర.
జాతివీరుడికి నివాళి అర్పించేందుకు బ్రిటన్ లోని అన్ని శాఖలకు చెందిన పోలీసు ఉద్యోగులు తమ స్థాయిలను, అధికార దర్పాలను ఒక్క క్షణం వదిలేశారు. బ్రిటన్ పార్లమెంటు భవనం వద్ద అతడు ప్రాణాలు కోల్పోయిన చోట నుంచి మొదలైన ఆ అంతిమయాత్ర రెండు మైళ్లదూరంలోని స్మశాన వాటికలో ముగిసింది. వందలాది పోలీసులు, వేలాది జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి దేశ నాయకత్వాన్ని కాపాడటంలో కీత్ పామర్ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అతడితో కలిసి పనిచేసిన మహిళా పోలీసులు కన్నీరు మున్నీరై విలపించారు.
ఒక వ్యక్తి ఆశయానికి, లక్ష్యానికి, విధి నిర్వహణకు కట్టుబడి ప్రాణతర్పణలు చేసినప్పుడు జాతి యావత్తు అతడి, ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి మించిన జన్మ సాఫల్యం మరొకటి ఉండదు కదా. ఆ జన్మ సాఫల్యం వ్యక్తపరుస్తున్న ఒక పేరు కీత్ పామర్.