పాకిస్థాన్: కరాచీ తాజా హింసలో 30 మంది మృతి

పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని కరాచీలో చోటుచేసుకున్న తాజా హింసలో సుమారు 30 మంది ప్రజలు మరణించారు. రాజకీయ విభేదాల కారణంగా తెగల మధ్య కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఘర్షణల్లో ప్రస్తుతం ముఠా యుద్ధాలు జరుగుతున్నట్లు పోలీసులు గురువారం పేర్కొన్నారు.

ఎక్కువ భాగం హింస లియరీ జిల్లా చుట్టుప్రక్కలే జరుగుతున్నది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి ప్రత్యర్ధి గ్రూప్‌ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజా హింసలో మరణించిన వారిలో పీపీపీ విధానకర్త ఒకరు కూడా ఉన్నారు. గత నెలలో కరాచీలో అశాంతి నెలకొనడంతో ప్రభుత్వం వందలాది మంది అదనపు బలగాలను తరలించింది.

జులైలో జరిగిన హింసలో సుమారు 300 మంది ప్రజలు చనిపోయారు. కాగా ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 800 మందికి పైగా మృత్యువాత పట్టినట్లు స్వయం ప్రతిపత్తి గల పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.

2001 సెప్టెంబర్ 11న అమెరికాపై దాడి తర్వాత అమెరికా నాయకత్వంలో తీవ్రవాదంపై జరుగుతున్న యుద్ధంలో పాకిస్థాన్ కూడా భాగస్వామిగా చేరిన అనంతరం అల్‌ ఖైధాతో సంబంధం ఉన్న తీవ్రవాదులు కరాచీ లక్ష్యంగా బాంబుదాడులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. విదేశీయులు తరచుగా దాడులకు గురవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి