పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీతో బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ భేటి అయ్యారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఇరుదేశాల ప్రధానుల సమావేశం కానున్నారు. ఈజిప్టులో జరుగుతున్న 15వ అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సులో భాగంగా బుధవారం నుంచి ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి.
ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఉదయం పాక్ ప్రధానితో సమావేశం కానున్న నేపథ్యంలో గిలానీని శివశంకర్ మీనన్ ముందుగా కలుసుకున్నారు. ఇరుదేశాల ప్రధానులు తాజాగా జరిపే చర్చల్లోనూ ముంబయి ఉగ్రవాద దాడి ప్రధానాంశం కానుంది. ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా సమీక్షిస్తారు.
పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ మధ్య బుధవారం నుంచి జరుగుతున్న అనేక రౌండ్ల చర్చల్లోనూ తీవ్రవాదం, ముంబయి దాడులే ప్రధానాంశాలుగా నిలిచాయి. పాకిస్థాన్ అధికార బృందంతో సమావేశాల అనంతరం మీనన్ మాట్లాడుతూ.. చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు.
చర్చల్లో కొంత పురోగతి సాధ్యపడిందని తెలిపారు. ఇరుదేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు లేదా వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలకు మించిన మార్గం మరొకటి లేదని మీనన్ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఇరుదేశాల మధ్య క్లిష్టమైన వివాదాలు నెలకొన్నాయి. ఇప్పటికీ పరిష్కరించుకోవాల్సిన దీర్ఘకాల వివాదాలు ఇరుదేశాల మధ్య ఉన్నాయని తెలిపారు.