భారత్‌తో బెంబేలెత్తుతున్న పాక్: మిల్ట్ బియర్డన్

ఆఫ్గనిస్థాన్ ఒక భారతదేశపు కోటలాగా అభివృద్ధి చెందుతోందని కాబట్టే ఈ ప్రభావాన్ని తగ్గించేందుకుగాను గత కొద్ది సంవత్సరాలుగా తాలిబన్ మరియు లష్కర్-యే-తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసి పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా తెలిపింది.

ఇస్లామాబాద్‌లోనున్న సీఐఏ స్టేషన్‌కు చెందిన మాజీ అధికారి మిల్ట్ బియర్డన్ అమెరికా సెనేటర్లతో కలిసి మాట్లాడుతూ... అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి పాకిస్థాన్ బెంబేలెత్తుతోందని, ఈ నేపథ్యంలోనే తాలిబన్, లష్కర్-యే-తోయిబాలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను ఏ దేశంపైన ఆరోపణలు చేయడంలేదు. కాని ప్రతి ఒక్క దేశం తమ తమ దేశాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు.

భారతదేశం ఆఫ్గనిస్థాన్‌లో నిదానంగా వేళ్ళూనుకునేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ భావిస్తోందని, ఆఫ్గనిస్థాన్ భారతదేశానికి చెందిన కోటలాంటిదిగా ఆయన అభివర్ణించారు.

ప్రస్తుతం పాకిస్థాన్ దేశం ఇలాగే ఆలోచిస్తోందని, ఇది వాస్తవమని, తాను మెప్పుకోసం మాట్లడటం లేదని ఆయన అన్నారు. ఇక చైనా దేశంకూడా తనకు తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశం పాకిస్థాన్‌లోని గ్వాదార్ ప్రాంతంలో ఓ పెద్ద ఓడ రేవును నిర్మిస్తోందని ఆయన సెనేట్‌కు వివరించారు.

వెబ్దునియా పై చదవండి