ఫోన్ స్విచ్ ఆఫ్ చేసానంటున్న ‘నిను వీడని నీడను నేనే’ హీరోయిన్: అన్యా సింగ్ ఇంటర్వ్యూ

సోమవారం, 15 జులై 2019 (20:59 IST)
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదలైంది.

కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అన్యా సింగ్ కథానాయికగా పరిచయం అయ్యారు. విడుదలైన రోజు నుంచి చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో అన్యా సింగ్ మీడియాతో ముచ్చటించారు.
 
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది ఢిల్లీ. నేను అజ్మీర్ లోని బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అందుకని మానేశా‌. బోర్డింగ్ స్కూల్లో చదివిన తర్వాత మళ్లీ స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలనిపించలేదు. కాలేజీలో ఉన్నప్పుడు వెడ్డింగ్ ప్లానర్ ఒకరితో కలిసి పనిచేశా. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. అందుకని చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను.
 
శుక్రవారం సినిమా విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది?
గ్రేట్ రెస్పాన్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని క్లైమాక్సులోని ఎమోషనల్ సీన్స్ తమ మనసును కదిలించాయని చెబుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం నేను కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో ఎవరో బాలేదని రాస్తే చదివాను. నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్‌కి వెళ్లిపోయా. మా అమ్మకు అంతకుముందే ఫోన్ చేసి చెప్పాను. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారమ్ ఫోన్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఇంటర్నెట్లో చూశా. సోషల్ మీడియాలో, రివ్యూస్‌లో సినిమా చాలా బాగుందని రాశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. ఐ యాం సో హ్యాపీ.
 
విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు కదా. ప్రేక్షకుల్ని నేరుగా కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు?
సినిమా ఈ రోజే విడులైంది కదా ఎక్కువమంది చూశారో లేదో అనుకున్నాను. శుక్రవారం సాయంత్రానికి చాలామంది చూశారు. మెట్రోలో వెళ్ళినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. ఒక్క చిత్రమే చేశాను కదా! నన్ను గుర్తు పట్టకున్నా..‌‌‌. సినిమా చూశామని చెబితే సంతోషించా. సందీప్ కిషన్ చుట్టూ ప్రేక్షకులు గుమిగూడారు. తనతో సెల్ఫీలు తీసుకోవటానికి ఎదురుచూశారు.
 
ఈ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది?
మా హీరో సందీప్ కిషన్, దర్శకుడు కార్తీక్ రాజు నా తొలి హిందీ సినిమా ‘Qaidi Band’ చూశారు. అందులో నా నటన నచ్చి ఈ అవకాశం ఇచ్చారు.
 
ఈ సినిమా సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సందీప్ కిషన్ చెప్పారు. ఏమైంది?
క్యాన్సర్ వలన మా నాన్నగారు మరణించారు. నాకు తీరని లోటును మిగిల్చి వెళ్లిపోయారు. నాన్న మరణంతో షాక్ లోకి వెళ్లాను. తర్వాత ‌ నెమ్మదిగా కోలుకున్నాను
 
‘నిను వీడని నీడను నేనే’లో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశారు. ఒక సన్నివేశంలో దెయ్యంగాను కనిపించారు. సినిమాలో మీరు బాగా కష్ట పడిన సన్నివేశం ఏది?
హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించేశా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డాను. సినిమాలో నా పాత్ర చూస్తే… చాలా ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్. ఎక్కువ సన్నివేశాల్లో ఏడుస్తూనే కనిపిస్తా. ప్రేక్షకులకు తెరపై పాత్ర తాలూకు భావోద్వేగాలను కనెక్ట్ అయ్యేలా నటించడం చాలా కష్టం. షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను.
 
మీకు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా?
హారర్ ఇష్టం లేదు. కొంచెం భయపడతా… చూడటానికి, చేయటానికి. థ్రిల్లర్స్ అంటే ఇష్టం. హాలీవుడ్ మూవీ ‘సెవెన్’ నాకు ఇష్టమైన థ్రిల్లర్ సినిమా. ‘నిను వీడని నీడను నేనే’ హారర్ కాదు కదా. సినిమాలో హారర్ సన్నివేశం ఒక్కటే ఉంది. అది చేసేటప్పుడు చుట్టూ జనాలు ఉన్నారు. అయినా… రాత్రిపూట తీయడంతో కొంచెం టెన్షన్ పడ్డాను. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే… థ్రిల్లర్ అయినా ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్ కూడా బావుంటుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది.
 
సందీప్ కిషన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
వెరీ కంఫర్టబుల్! నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అందువల్ల, షూటింగ్ జరిగేటప్పుడు సందీప్ కిషన్ ఎంతో హెల్ప్ చేశాడు. నాకు డైలాగులు అర్థం కాకపోతే వివరించి చెప్పేవాడు. సందీప్ కిషన్‌కి సినిమాలంటే ఎంతో ప్రేమ. వెరీ టాలెంటెడ్ యాక్టర్. కమిట్‌మెంట్‌తో వర్క్ చేస్తాడు. సన్నివేశం బాగా రావడానికి ఎంత కష్టపడటానికి అయినా వెనుకాడడు. అతనితో పాటు మా దర్శకుడు కార్తీక్ రాజు కూడా నాకు బాగా సహకరించారు.
 
ఈ సినిమాకు గాను మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మంది నేను సహజంగా నటించానని చెప్పారు. నేచురల్ యాక్టర్ అనడం బాగుంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. పరవాలేదు.
 
తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?
కొంతమంది నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. అయితే…‌ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాం. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్‌తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్ నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే నేను ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు