చెన్నైకి ఏమైంది.. ధోనీ సేనకు వరుసగా పరాజయాలు.. హైదరాబాద్ చేతిలో ఓటమి

శనివారం, 3 అక్టోబరు 2020 (09:28 IST)
ఐపీఎల్ 13వ సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంతగా కలిసిరావట్లేదు. దుబాయ్‌లో ఆడిన ఐపీఎల్ 2020 14వ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తదనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులే చేయగలిగింది. ఇది చెన్నైకి వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. 
 
షాన్ వాట్సన్ ఒక్క పరుగుకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అవుటవడంతో చెన్నైకి మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. ఈ క్రమంలో 10 ఓవర్లకు చెన్నై 50 పరుగులు కూడా చేయలేకపోయింది. అలాంటి సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోనీ బరిలోకి వచ్చాడు. మొదట ఆచితూచి ఆడిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును వంద పరుగులు దాటించాడు.
 
ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయం కోసం 78 పరుగులు చేయాల్సి వచ్చింది. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో రవీంద్ర జడేజా మూడు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లోనే మొత్తం 15 పరుగులు వచ్చాయి. నటరాజన్ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్ కొట్టిన జడేజా తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

అదే ఓవర్లో మరో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన శామ కరన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, శామ్ కరన్‌ను జట్టుకు విజయం అందించేందుకు చివరి వరకూ పోరాడారు.

చివరికి గెలుపుకు కావలసిన పరుగులు సాధించలేకపోయిన చెన్నై ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ధోనీ 36 బంతుల్లో ఒక సిక్సర్‌తో 47 పరుగులు, శామ్ కరన్ 5 బంతుల్లో 15 పరుగులు చివరి వరకూ నాటౌట్‌గా నిలిచారు. 
Chennai Super kings
 
అంతకు ముంకు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ జానీ బెయిర్ స్టో వికెట్(0) కోల్పోయింది. తర్వాత వచ్చిన మనీష్ పాండే, డేవిడ్ వార్నర్ స్కోరును ముందుకు కదిలించారు. 47 పరుగుల దగ్గర మనీష్ పాండే(29) అవుటయ్యాడు. మెల్లగా ఆడుతూ 28 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో సిక్స్ కొట్టాలని ప్రయత్నించాడు. 
 
కానీ బౌండరీ లైన్ దగ్గర ఫాఫ్ డిప్లెసీ అద్భుతమైన క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాత బంతికే కేన్ విలియమ్సన్(9) కూడా రనౌట్ అయ్యాడు. 11వ ఓవర్లకు 69 పరుగులే చేసి, టాప్ వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్‌ను యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ ఆదుకున్నారు. స్కోరును 140 పరుగులు దాటించారు. అభిషేక్(31) అవుటైనా ప్రియం గార్గ్ తన జోరు కొనసాగించాడు. 26 బంతుల్లో 1 సిక్సర్ సహా 51 పరుగులు చేసి జట్టు స్కోరును 164కు చేర్చారు. ఇది ఐపీఎల్‌లో ప్రియం గార్గ్‌కు మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు