ఆ ఒక్క క్రికెటర్ వల్లే ఐపీఎల్ వాయిదా... రూల్ బ్రేక్ చేయడంతో కాటేసిన కరోనా??

శుక్రవారం, 7 మే 2021 (08:50 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 14వ సీజన్ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి. ఒక్క క్రికెటర్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఇపుడు బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. ఫలితంగా టోర్నీని నిరవధికంగా వాయిదావేశారు. అసలు ఎక్కడ తప్పిదం జరిగిందన్న విషయం ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
గత యేడాది కూడా కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉన్నప్పటికీ యూఏఈలో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ టోర్నీ సాగింది. కానీ, ఈ ఏడాది మాత్రం ఎందుకు ఇలా అర్థాంతరంగా ముగిసిపోయిందనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. అసలు పటిష్టమైన బయోబబుల్‌లోకి కరోనా ఎలా ప్రవేశించిందనే ఆనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే బీసీసీఐ విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ విచారణకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
 
మే ఒకటో తేదీన అహ్మదాబాద్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. భుజం స్కానింగ్ కోసం అతడు ఆసుపత్రికి వెళ్లినట్లు అధికారికంగా నమోదైనా.. కడుపులో సమస్య ఏర్పడడంతో వల్ల హోటల్ నుంచి బయటకు వెళ్లినట్లు తేలింది. అక్కడ స్కానింగ్ పూర్తి చేసుకొని కాసేపటికి వరుణ్ హోటల్‌కు తిరిగి వచ్చాడు. అయితే బయోబబుల్ రూల్ ప్రకారం ఎవరైనా అలా బయటకు వెళితే అతడు ఖచ్చితంగా మిగతా జట్టు సభ్యులతో కలవకూడదు. 
 
విధిగా వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చాకే.. జట్టుతో కలవాలి. కానీ వరుణ్ థావన్ ఇక్కడు రూల్ బ్రేక్ చేశాడు. అతడు జట్టుతో కలిసిపోయాడు. ఆ తర్వాత స్టేడియంకు అందరితో కలిసి బస్సులో బయలుదేరాడు. మధ్యలో సందీప్ వారియర్‌తో కలిసి ఓ హోటల్లో భోజనం చేశాడు. అయితే స్టేడియం చేరుకున్న తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదని, ప్రాక్టీస్ చేయలేనని చెప్పడంతో విశ్రాంతి తీసుకున్నాడు. మిగతా వారంతా ప్రాక్టీస్‌కు వెళ్లిపోయారు.
 
అదేసమయంలో ఆ మైదానంలో ఢిల్లీ క్యాపిల్స్ జట్టు అప్పటికే వచ్చి ప్రాక్టీస్ చేస్తంది. నిజానికి బయోబబుల్ రూల్స్‌లో మరొకటి ఏ రెండు జట్లూ కలిసి ప్రాక్టీస్ చేయకూడదు. కానీ కేకేఆర్ ప్రాక్టీస్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఢిల్లీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే బయోబబుల్ రూల్ ప్రకారం.. మ్యాచ్ ముందు రెండు జట్లు కలవకూడదు. కానీ ఇక్కడ కూడా మరో రూల్ బ్రేక్ అయింది. 
 
కేకేఆర్ ఆటగాళ్లు ఢిల్లీ ఆటగాళ్లు కలిసిపోయారు. వరణ్‌తో కలిసి భోజనం చేసిన సందీప్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలవగా.. ఇద్దరు కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత హోటల్ గదికి వచ్చిన మిశ్రాకు అస్వస్థతకు గురయ్యాడు. 
 
అంతలోనే సందీప్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. వరుణ్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. దీంతో వారు ముగ్గురికీ హుటాహుటిన కరోనా పరీక్ష నిర్వహించిన వైద్యులు పాజిటివ్ అని తేల్చారు. 
 
అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా ఎలా సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ జట్టు సభ్యుడు చేసిన చిన్న పొరపాటు, ఐపీఎల్ పాలకమండలి నిర్లక్ష్యం.. వెరసి టోర్నీ రద్దుకు, వేలాది కోట్ల నష్టానికి దారి తీసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు