ఐపీఎల్ 14 సీజన్‌లో నిరాశపరిచిన ముంబై : ఆకాశ్ అంబానీ ఏమన్నారు?

సోమవారం, 11 అక్టోబరు 2021 (12:59 IST)
AAkash
ఐపీఎల్ 14 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన చూసి బాధపడనని ఆ ఫ్రాంఛైజీ ఓనర్‌ ఆకాశ్‌ అంబానీ అన్నారు. వరుసగా రెండేళ్లు ఛాంపియన్స్‌గా నిలిచిన రోహిత్‌సేన ఈసారి త్రుటిలో ప్లేఆఫ్స్‌ అవకాశాన్ని కోల్పోయింది. 
 
లీగ్‌ దశలో కోల్‌కతాతో సమానంగా 14 పాయింట్లతో నిలిచినా రన్‌రేట్‌ మెరుగ్గా లేకపోవడంతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో  మోర్గాన్‌ టీమ్‌ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో ముంబై జట్టుతో ఆకాశ్‌ మాట్లాడిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
 
'ఈ నాలుగేళ్లలో (2017-2021) మూడుసార్లు ట్రోఫీలు సాధించడం అంత ఆషామాషీ కాదు. ఇక రాబోయే రెండేళ్లు కూడా ఎలా ఆడతామనే విషయంపై మాకు ఎంతో నమ్మకం ఉంది. అలాగే ఈ సీజన్‌ ఫలితాలు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పటికే అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదిగాం. మీ అందరికీ కృతజ్ఞతలు. 
 
ముంబై ఇండియన్స్‌ తరఫున ప్రతి ఒక్కరు సమష్టిగా రాణించారు. ఇలాంటి జట్టుని కలిగి ఉండటం మా అదృష్టం. మీరంతా ఒక కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్‌లో ఎవరు ఎక్కడ ఉంటారనేది పక్కనపెడితే ముంబయి ఇండియన్స్‌ మిమ్మల్ని ఎప్పుడూ ఒకేలా చూస్తుంది' అని ఆకాశ్ వివరించారు. 
 
 
 
కాగా, రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ 2013 నుంచి 2019 వరకు ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగుసార్లు టైటిల్‌ సాధించింది. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి ఐదుసార్లు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఈసారి కూడా ఛాంపియన్స్‌గా అవతరించి హ్యాట్రిక్‌ సాధిస్తుందని అభిమానులు ఆశించగా, ఆటగాళ్ళ పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. పలు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 'ప్లేఆఫ్స్‌'కు చేరుకోలేకపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు